శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారిపై శ్రీ నోరి నరసింహశాస్త్రి గారి వ్యాసం
శ్రీ విశ్వనాథ
సత్యనారాయణ
“పూవుం
జిమ్ములు తేనెవాకలు రసంపుంబల్కు లానంద మో
హావేశమ్ములు
నీవు పెట్టినది పేరన్నా! భవద్గాన వీ
ణా వైశద్యము సన్నగించి,గళితానందాశృరేఖా
వ్యధా
భావమ్ముల్ వెలిబుచ్చ వేమిటికి నీ పాటల్ వయష్షట్పదా”
“రోలంబేశ్వర!
నీది నిర్జరవయోరూపంబు శృంగార ల
క్ష్మీ లీలారస పట్టభద్రుడవునున్ మేలే ! యిటుల్ వంత చే
వ్రాలంగా
గతమేమి? లో మరచితో స్వాతంత్ర్య కళ్యాణ గా
నా లీలామృత
గీతికాక్షర సమామ్నాయంబు ప్రాయంబునన్”
అది 1922, 23
ప్రాంతము. బెజవాడలో శారదా భాండార
ప్రెస్సుకు వెళ్ళగా, అక్కడ ప్రెస్సు మేనేజరు
శ్రీ
కొడాలి ఆంజనేయులు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ శివశంకర శాస్త్రి ఇత్యాది కవిమిత్రులు కలిసినారు. అదే నేను శ్రీ విశ్వనాథను ప్రథమ పర్యాయము
కలిసికొనుట. కవిగా అప్పటి కాయన పేరు బందరంతా
మారుమ్రోగుతున్నా, బయటి ప్రపంచానికి తగినంతగా
ప్రాకలేదు.
అందరమూ
ఉత్సాహంగా సాహిత్య ప్రసంగంలో పడియున్న సమయంలో అప్పటికి రాబోతున్న సాహితి తృతీయ
సంపుటము ప్రథమ సంచికకు పద్యాలు వ్రాసి పెట్టమని శ్రీ శి.శం.శాస్త్రి శ్రీ
విశ్వనాథను తొందరచేస్తున్నాడు. ఆయనను
శ్రీ శాస్త్రి, ఆంజనేయులు ఆదరముతో ప్రేమతో ప్రెస్సు వెనుకభాగంలో ఉన్న
గదిలోనికి పంపినారు. ఇష్టం లేకుండానే
వెళ్ళి తిరిగి అరగంటలో ఉత్సాహంతో, ఎర్రపడ్డ ముఖంతో శ్రీ
విశ్వనాథ మా మధ్య ప్రత్యక్షమైనాడు.
అప్పుడే వ్రాయడమైనదా అని ఆశ్చర్యంతో
అడిగే లోపలనే ఆరుపద్యాల ఖండకావ్యము వినిపించి ప్రచురణకు శ్రీ శాస్త్రికి
ఇచ్చినాడు. అందులో మొదటిదీ, చివరదీ పైన ఉదాహరింపబడ్డవి. మధ్య రెండు సీస పద్యాలు కూడా ఉన్నవి.
అప్పటికింకా
శ్రీ ఆంజనేయులుతో జంటకవనము మానలేదు కనుక “సత్యాంజనేయులు” పేర “విపర్యాసము” అనే శీర్షికతో
సాహితిలో అవి ప్రచురింపబడ్డవి. అప్పటికి
శ్రీ విశ్వనాథకు పాతికేళ్లు ఉన్నట్లు జ్ఞాపకము, పద్యాలలో కూడా ఆ వయస్సునే సూచించే “నిర్జర వయో
రూపంబు” అనే పద ప్రయోగమున్నది. ఆ వయస్సుకే
శ్రీ విశ్వనాథకు శబ్దము మీద ఎంత అధికారమూ, భావనలో ఎంత పరిణతీ
సుస్థిరమైనవో ఆ పద్యాలు ప్రదర్శిస్తవి. ఆ
జన్మమూ కవులయినవానికే గాని అది సాధ్యము కాదు.
ఆ తర్వాత
ఆయనను కలిసినది కొద్దికాలమునకే తెనాలిలో జరిగిన సాహితీసమితి సమావేశములో. ఆ సమావేశము ఒక విధంగా అపూర్వమైనది. దానికి శ్రీయుతులు శివశంకరులు,
విశ్వనాథ, దేవులపల్లి, వేదుల, నండూరి, కొడాలి ఆంజనేయులు,
చింతా దీక్షితులు, త్రిపురారిభట్ల,
శ్రీనివాస శిరోమణి ఇత్యాదులెందరో వచ్చినారు.
అప్పటికి రచయితగా పరిణమించని శ్రీ గుడిపాటీ, కొత్తగా
పద్యరచన సాగిస్తున్న పెనుమర్తి వెంకటరత్నం ఉత్సాహవంతులగు ప్రేక్షకులుగా ప్రతి
సమావేశానికీ హాజరైనారు. సమితి
కాన్స్టిట్యూషన్ సిద్ధము చేయడానికి జరిగిన తర్జనభర్జనలు నాకే కాక, శ్రీ దీక్షితులకు కూడా వచ్చిన కోపతాపాలు, రాజీనామా
లిస్తామనే బెదరింపులు లీలగా జ్ఞాపకమున్నవి. అప్పటినుంచీ 1962 లో నేను ఒక్కడనే
తయారుచేసి సమితిచేత అంగీకరింప జేసేవరకూ సమితి వ్రాతపూర్వకముగా లేని నియమావళితోనే
నడిచింది.ఆ సభల
కార్యక్రమాలకంటే నా మనస్సులో స్థిరముగా
నిలిచియున్నది వచ్చిన వారము తీరిక సమయాలలో ఒకరితో ఒకరము ఇష్టాగోష్టిగా చేసుకున్న
సంభాషణలు.
శ్రీ
విశ్వనాథకు తిక్కన సోమయాజుల కవితారీతులమీద
నాతోపాటు అభిమానము పొంగిపొరలుతున్న రోజులవి.
ఇప్పటివలెనే అప్పుడు కూడా శ్రీ శివశంకరులకు శ్రీనాధుని రీతిమీద
విశేషాభిమానము. ఒకవంక శివశంకరులు శ్రీనాధుని పద్యాలు వినిపిస్తుంటే,
వాటికి దీటైన పద్యాలు నేనూ, శ్రీ విశ్వనాథ సోమయాజుల రచనలో
నుండి వినిపించినట్లు జ్ఞాపకము. సోమయాజులు
బహువిధముల పోకడలు పోగా వానిలో కొన్నికొన్నిటినే శ్రీనాధాదులు గ్రహించి
విస్తరించినారని మా వాదము. ఆ రోజులలో శ్రీ విశ్వనాథకు సోమయాజుల రచనా యందు
ఎంత గాఢాభిమాన ముండేదో గిరికుమార నామముతో ప్రచురించిన తిక్కన ప్రశంసా పద్యాలలో
స్పష్టపడుతుంది.
“ తెరల నెత్తెడు దింపెడు తెరలు పొరలు
చున్ననే వాజ్ఞదీవారి యొరపు మిగిలి
యస్మాదాదిక శిష్య హంసాలి ముక్కు
కోసల తడుపుచు తా ముంచుకొనుచు ముసరు”
సత్యాంజనేయుల
జంట కవనము నుండి విడివడే రోజులలో ముందు ఆయన “గిరికుమార” అనే లేఖినీ నామము
ధరించాడు. మేమా రోజులలో ఆయనను ముఖ్యంగా
గిరికుమారుడనే నిర్దేశించేవారము. పొంగులు
వారుతున్న యౌవనంలో ఆయన స్వీకరించిన “గిరికుమార” నామము ఆయన స్వభావాన్ని చక్కగా
ప్రతిబింబిస్తూంది.
మూడు
గీతపద్యాలు కలసిన ఖండకావ్య పరంపర “గిరికుమారుని ప్రేమ గీతాలు” ఆ రోజులలో
సాహిత్యలోకానికి పవిత్రమైన దాంపత్యప్రేమలోని మాధుర్యము చవిచూపినది. ఏ కృష్టుని మీదనో, ఏ
గోపిక మీదనో పెట్టి తమ అపవిత్ర కామావేశాలు ప్రేమగీతాలుగా ప్రచురించడము కవులకు
సర్వసాధారణముగా ఉన్న ఆ రోజులలో, గిరికుమారుని ప్రేమగీతాలు
ఆయనను మాబోంట్లకు కేవలమాత్మీయునిగా చేయగలిగినవి.
గిరికుమారునిలో
నుండి సరాసరి పుట్టినదే “కిన్నెరసాని వాగు”
అప్పటికి “కిన్నెరసాని పాటలు” పుట్టలేదు. “కిన్నెరసాని వాగు” అనే శీర్షికతో గీతమాలిక
కృష్ణా పత్రికలో చదివిన జ్ఞాపకము. అందులో
తన కవిత్వము సరాసరి గట్లమధ్య ప్రవహించే కాలువ కాదనీ, వంకరలు
తిరుగుచు, దూకుచు కొండలలో స్వేచ్ఛగా గానము చేస్తూ, సాగే కిన్నెరసాని వాగు అనీ సమర్ధించుకున్నాడు. తన పద్యాల నడక ఎగుడుదిగుడుగా ఉంటుందని ఎవరో
అన్నారు కాబోలు, “ఓయి రసహీన” అని ఆయనను సంబోధిస్తూ ఆ కావ్యము
చెప్పినాడు. భద్రాచల యాత్రలో తాను చూచిన
కిన్నెరసాని వాగూ, దాని నామము ఆయననెంతో ఆకర్షించి
ఉండవలె. తర్వాత కిన్నెరసాని పాటలు పుట్టినవి. కీనీరసాని వాగుగా ప్రారంభించిన ఆయన సాహిత్య
స్రవంతి పోనుపోను మహాగోదావరిగాను, కృష్ణవేణీ నదీ
ప్రవాహముగాను పరిణమించినదిగాక.
నాకు ప్రథమ
పరిచయమైన ఆ రోజులనుండి నేటివరకు శ్రీ విశ్వనాథ ప్రతిభావ్యుత్పత్తులు ఊహ
కందరానివిగా విస్తరించినది. నా కా
పరిచయమును విస్తరించినది. సభావేదికల మీద
ఆయన స్వరూపము నానావిధాకారాలు ధరిస్తుంది కాని, ఆయనను ఇంటివద్ద కలసికొని
ఆయన ఆతిథ్యము చవిచూచినవారికి ఆప్యాయతతో కూడిన అమృతహృదయమొక్కటే గోచరిస్తుంది.
మంచినీటికి
కటకటగా ఉన్న రోజులలో బెజవాడలో చేసిన ఆయన కుమార్తె వివాహానికి నేనూ వెళ్ళడము
తటస్టించినది. మధ్యాహ్న భోజనాలయిన తరవాత
ప్రక్కనున్న మేడమీద పలువురు సాహిత్యవేత్త లానాడు ఇష్టాగోష్టి జరిపినారు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధ కవులందరి ప్రస్తావనా
వచ్చినది. ఆ రోజులలో కొత్తగా తెలుగులో
కవిత్వము చెప్పసాగిన ఒకానొక ముసల్మాను కవిమీద అప్పుడు శ్రీ విశ్వనాథకు అభిమానము
కలిగినది. ఆ కవిప్రశంస ఆయన ఆనాడు విస్తారముగా
చేయసాగినాడు. ఆ బాలకవి పద్యాలెన్నో
మెప్పుతో ఆయన వినిపించినాడు. అందరమూ
నవ్వులమధ్య ఆ కవిని ప్రసిద్ధిలోకి తీసుకొని రావలెనని తీర్మానించినాము. కాని, ఇప్పటికీ ఆ బాలకవి
అజ్ఞాతకవి గానే ఉండిపోయినాడు. ఈ విధంగా
మధ్యమధ్య శ్రీ విశ్వనాథకు అభిమానము ఎంత చిత్రమైన పోకడలు పోతుందో చెప్పలేము. ఆ కవి రచనలో ఏదో ఒక మూల చిన్న విశేషము ఆయనకు భాసిస్తుంది. దానితో వెంటనే అభిమానము పొంగులు
వారుతుంది. ఎక్కడో కొంచము వర్షము పడినా
చప్పున పొంగే వాగు వలెనే.
శ్రీ
విశ్వనాథకు చాలామంది శిష్యులు, భక్తులూ ఉన్నారు. వారాయన రచనలు పదేపదే,
ఒకరన్నట్లు మడిగట్టుకొని కూడా అధ్యయనము చేస్తారు. పారాయణ చేస్తారు. ఆయన మాటలు స్మరిస్తూ పారవశ్యము పొందుతారు. ఆయన పాఠశైలి అవలంబిస్తారు. ఆయన తీరుతెన్నులుకూడా స్పష్టంగా
అనుకరిస్తారు. తమ రచనలు ఆయన రచనల ఒరవడిలో
సాగిస్తారు. ఆయనమీద ఇంత ఈగ వాలినా
సహించలేరు.
అట్లాగే
ఆయనకు భక్తులెందరున్నారో శత్రువులు కూడా అందరున్నారనిపిస్తుంది. వారిలో ఎక్కువ భాగము పౌండ్రక వాసుదేవుడు,
కంసుడు, శిశుపాలుడు వంటివారు. వైరానుబంధము వల్లనే వాళ్ళాయన రచనలు శ్రద్ధగా
పఠిస్తారు లోపాలు లెక్కించడానికి.
కృష్ణానది వరదలో ఉన్నప్పుడూ ఎన్ని కళేబరాలు కొట్టుకొనిరావు, వాళ్ళు వాటికోసమే గాలించి ఇదుగో పట్టుకొన్నామని గంతులు వేస్తారు. ఏ ఉద్దేశంతో చేసినా వాళ్ళకు ఆ ప్రవాహావగాహనము
తప్పదు. ఆ అవగాహనము వల్ల భక్తులు పరిపూతుల
మయినట్లు భావిస్తారు, ఆ శత్రువులు తమ శరీరాలూ, కట్టిన పుట్టాలూ మురికిపడ్డవని అసహ్యపడతారు. అందులో తలమునుకలై ప్రాణాలతో బయటపడ్డందుకు
నిట్టూర్పులు విడుస్తారు. కొందరు ఆ
శత్రువులు కూడా విపరీతరూపము ధరించిన భక్తులే. వైరానుబంధముచే సమస్తము హరిమయమని భావన
చేసిన కంసునివంటివారే.
మరి ఇక
శ్రీ విశ్వనాథకు మిత్రులెవరైనా ఉన్నారా అన్నది మా బోంట్లము విడదీయలేకున్న చిక్కు
సమస్య. ఆయన కత్తి వంటివాడు. ఒక్క ఒరలో
రెండు కత్తు లిమడవని గదా లోకోక్తి. ఆయనతో
సమాన ప్రతిపత్తిలో ఆప్తులై వ్యవహరించే వాళ్ళెవరైనా ఉన్నారా అని నాకెప్పుడూ
సందేహమే. అట్టివారు నాదృష్టిలో పడలేదు. అటువంటి ఆప్తమిత్రులు కాదగిన వారెందరో
సన్నిహితులు కాకుండా పోయినారని నా నిశ్చయము.
అట్టివారే కొందరు దురహంకారులైనందున
ఆయన శత్రువులుగా పరిణమించినారని నా విశ్వాసము. ఇతరులు సహృదయులైనవారు వీలైనంత వరకు దూరముగా
ఉంటారు. ఆయనతో ఏకాంతముగానయినా మంచిచెడ్డలు
పర్యాలోచన చేయడము కష్టమయినందున సన్నిహితత్వము ప్రమాదకరమని అట్టివారు గుర్తించి
ఉంటారు.
శ్రీ విశ్వనాథ బాల్యదశలో నుండి శ్రీ తిరుపతి
వేంకటేశ్వరుల నానారాజ సందర్శనములు, విజయ యాత్రలు బాగా
విన్నవాడు. పూర్వకాలము నుండి మన దేశములో
విద్వాంసులు శాస్త్ర వాదములతో విజయయాత్రలు చేయుట పరిపాటి కాని కవులట్టివి చేయుట
అరుదు. శ్రీనాధభట్టు విజయయాత్ర అట్టి
అపవాద సూత్రాలలోని దందాము లేక ఆకృతిగణము అందాము.
శ్రీనాధుని యాత్రాకధలు మనస్సులో పెట్టుకొని శ్రీ తిరుపతి వేంకటేశ్వరులు
నానా సభా విజయములు అద్వితీయముగా సాగించినారు.
ఆ
భావములతోనే శ్రీ విశ్వనాథ కూడా ప్రభావితుడయినాడు.
అయితే ఆయనకు పెద్దరికము వస్తున్న రోజులలోనే రాజులందరూ అకస్మాత్తుగా
మాయమైనారు. ప్రజలే ప్రభువులై కూర్చున్నారు. మహాసభలే రాజాస్థానాలయినవి. శ్రీ విశ్వనాథను
సభకు ఆహ్వానించని పేరుగల పల్లె కూడా ఆంధ్రదేశంలో లేదనడములో అతిశయోక్తి లేదు. పల్లెలో గాని, పట్టణములో గాని, మహానగరములో గాని ఆయనది ఎప్పుడూ అగ్రస్థానమే. ఆయన కావ్యాలు వినిపిస్తే ముగ్ధులై
వింటారు. ఆయన దీవించినా, ఎందుకైనా కోపము వచ్చి ఒకవేళ
తిట్టినా ఒక్కరూ అక్కడ నోరెత్తరు. ఆ
తర్వాత ఇంటికి పోయి గొణుగుకోవలసినదే.
అట్టివాళ్ళే మళ్ళీ మరొక సభకు ఆయనను భక్తి ప్రపత్తులతో ఆహ్వానిస్తారు. ఈ విధంగా తన చిన్ననాటి దిగ్విజయ స్వప్నాలు
ప్రత్యక్షానుభవంలోకి తెచ్చుకొన్న సుకృతి శ్రీ విశ్వనాథ.
ఈ వ్యాసము
ప్రారంభించినపుడు యాదృచ్ఛికంగా ఒక మిత్రుడు వచ్చి ఆయనను గూర్చి “ నిండు మనంబు
నవ్యనవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము” అని అందించినాడు. నవ్యనవనీత సమానమైన ఆయన పల్కులు కూడా ఎరిగిన నాకది
న్యాయమని తోచలేదు.
ఆయన రచనలలో
గాని, వ్యక్తిలో గాని ఏదో అలౌకికమైన మహాశక్తి ద్యోతమౌతుంది. అది మహా ప్రభంజన శక్తి. ఆ శక్తిని ఆంగ్లభాషలో చెప్పవలెనంటే (Tritausic) అని నిర్దేశింపవచ్చును. ఆయన తన్ను
గూర్చి ఎక్కడో యోగభ్రష్టుడనని గీతావాక్యార్ధముతో చెప్పుకొన్నట్లు జ్ఞాపకము. కొంతవరకది సత్యమే కావచ్చును. నాకు మాత్రము విజ్ఞాన దృష్టితో భావన చేయగా, ఒకటి స్ఫురించినది. శ్రీ సాంబసదాశివుని
సేవించే గణములలో నుండి ఏదో శివాజ్ఞ నిర్వర్తించడానికి మన ఆంధ్రభూమిలో అవతరించిన సహస్ర
బాహువులు సహస్ర శీర్షములు గలిగిన ప్రమథమూర్తి యేమో అనిపించింది శ్రీ విశ్వనాథ. అందువల్లనే ఆయన విశ్వనాథ వారింట, శివప్రతిష్ట చేసిన పుణ్య దంపతుల గర్భవాసాన జన్మించినాడని నా విశ్వాసము.
[ పై వ్యాసం
పై మీకు కాపీరైటు హక్కు వుంటే దయజేసి తెలియజేయగలరు. వెంటనే తొలగించబడుతుంది. ఈ బ్లాగు లక్ష్యం మహాకవి, కవిసామ్రాట్
విశ్వనాథ వారిని స్మరించుకోవడమే]