షష్టిపూర్తి మహోత్సవ దర్శనం
షష్టిపూర్తి మహోత్సవ దర్శనం
అటు చూడండి! ఈ
సంక్రాంతికి గుడివాడ ఎంతటి ఆనందోత్సవం జరుపుకొంటున్నదో. ఆ పౌరుల ఉత్సాహం వాడ వాడల రంగుల మృగ్గులై పచ్చ
పచ్చని పందిరులై, త్రోవల వాకిళ్ళ పెండ్లి తోరణాలై శుభశోభనముల పొంగులై లో లో
మురిసిపోతున్నది. సుకృతంపు రాసులైన ఆ పౌరుల మనస్సుల్లో నెలకొని కనుపాపల్లో
తళుకులాడు “బ్రాహ్మీమయమూర్తి ఎవరా” అని తెల్లబోకండి. తెలుగుల నోముపంట,
అలఘుస్వాదు రసావతారము, శోభనాద్రి సుతుడు, కవిసామ్రాట్, ఈ బిరుదు తృప్తినీయలేదో, పోనీ! కవివిరాట్టు, ముఖములు విప్పారినవే.
ఇటు మనసు
విప్పి అటు కన్ను విప్పండి, అదే నందులవలె నిలచిన అరువది వృషభయుగ్మముల బారు. ఆ వెనుక గజరాజు, ఆపై
అంబారీ, అందు ఇటు నటరాటమూర్తి అటు శారదామూర్తి. శారదాదేవి విరజిమ్మిన పూలవలే ప్రోవులై పడియుండి
రసములూరు దళబంధములవి. ఆ మధ్య మహోన్నతమై
నిలచినది రామాయణ కల్పవృక్షము.
విశ్వనాధ
సత్యనారాయణగారేరి? ఏమి ఎఱుంగని అమాయకునివలే – పట్టనట్లు – అటు చూడండి – ఆ కారులో స్నేహితులతో
ముచ్చటలాడుకొంటూ. ఆ ప్రక్క కూరుచున్నదా – కాటూరు
వేంకటేశ్వరరావుగారు. ఈ ప్రక్కనా? తెలుగు రాజు
గారు. ఆ ఎక్కేదా మన అభినవ తిక్కన తుమ్మల
సీతారామమూర్తి చౌదరిగారు. భ్రాతృ భక్తిలో
మునుకలాడుచు అటు లక్ష్మణునివలె అటు ఒత్తిగిలి కూరుచున్నది కవి సామ్రాడనుజులు
వేంకటేశ్వరులుగారు.
ఈ వింత దృశ్యం
చూచారా! అదిగో దీపజ్యోతులు చేపట్టి సరస్వతీ మూర్తికి హారతులెత్తుచున్న
గృహాలక్ష్ములు. ఏమి దివ్య శోభ. భక్తి
గౌరముల సమ్మేళనమిట్లా వుంటుంది. మహావిద్వాంసుల, కవుల పాదధూళికి
ఈనాడు గుడివాడ ధన్యమైనదనే చెప్పాలి.
14-1-56
మొదటిరోజు ఉదయం శ్రీ గడ్డమణుగు వెంకట అప్పారావుగారి లలితాభవనము నుండి వెడలిన
ఊరేగింపు నాగస్వరాలు విన్నారు గదా! ఇక పదండి, పురపాలక పాఠశాలా భవనంలో సరస్వతీ సమారోహం
జరుగుతోంది. అదిగో మోపర్రుదాసు గారు ప్రార్థన
చేస్తున్నారు. శ్రీ కుప్పా
లక్ష్మణావధానులుగారి ముఖ నిస్సృతమై వేదమాత పుంభావసరస్వతిని
ఆశీర్వదిస్తున్నది. ఎంత హాయి. వేదనాదం మానవజాతికే
చిరతరాశిషం.
అదో తెలుగురాజు
పెన్మెత్స సత్యనారాయణరాజుగారు ప్రారంభోత్సవం చేస్తూ – నేడు రాజులు లేరు కనుక
తెలుగు కవిరాజు ప్రారంభించటం సముచితమే అంటున్నారు. విన్నారా! ఆ ప్రక్క నుండి వీరిద్దెరెవరు? కవిసామ్రాట్టుని ఆశీర్వదించుడని కోరుతున్నారా!
అబ్బే వారే ఆయనకు పద్యాశీస్సులిచ్చి పోతున్నారు. ఎవరు?
కాకాని నరసింహారావుగారు, నిట్టలసూర్యనారాయణగారున్నూ, మటికి, సాహసికులౌను. ఇదేమిటి? ఆహ్వాన
సంఘాధ్యక్షులుడాక్టరు నారాయణరావుగారు పకోడీలు, పంచదార కలిపి
పంచిపెడుతున్నారు. మల్లాది శివరాం గారు
కూడా కాగితాలబొత్తి చేతబట్టి వేదిక నెక్కుతున్నారు, ఏమి
పంచిపోతారో?
“దేశం నలుమూలలనుంచి, ఆశీర్వాదాలు, అభినందనలు – ఆకాశం గుండా ఎగిరివచ్చి ఇప్పుడే
ఇక్కడికి చేరాయి. శ్రీ పట్టాభి సీతారామయ్యగారు, గవర్నరు త్రివేదీగారు, ఎ.బి.నాగేశ్వరరావు, గౌతు లచ్చన్న, కళా వేంకటరావు, దువ్వూరి నరసరాజు, అల్లూరి సత్యనారాయణ రాజు, తెన్నేటి విశ్వనాధం, కె.వి.గోపాలస్వామి నాయుడు మొదలగు పెద్దలు విశ్వనాథ కవిని తమ తమ నెలవులనుండే
ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తునారు, బాగుంది
కానీ సేలువ, వలువలు పుచ్చుకొని చక్కా వస్తున్నారాయన యెవరు? కరెడ్ల నరసింహంగారా! బాగుంది బాగుంది, కవిగారికి కట్టబెడుతున్నారు.
చుట్టూవారా చేరి
ఉలక్కుండా పలక్కుండా కూర్చున్న దివ్యస్ఫూర్తులు ఈ విద్వన్మూర్తులెవరని ఆలోచిస్తున్నారా!
ఎవరని చెప్పేది! తెలుగు నేల నాలుగు చెఱగుల నుండి నేడు సరస్వతి గుడివాడకు ప్రవహించి
వచ్చింది. ఇక అధ్యక్షులై కూర్చున్నది అప్పారావుగారు
(ఉయ్యూరు కుమార రాజా) ఆయన స్వాత్మానందుడులెండి. ఆ యువకులను చూచారా! చిరంజీవులు సి.నారాయణరెడ్డి, దాశరథి. పద్యాలు, పాటలు చదువుతున్నారే. శారదాదేవి ఆస్థానంలో
తాము వున్నట్లు భావిస్తున్న వైఖరి కనిపిస్తుందేమో.
ఇంకొక సుకృతం – అభినవ తిక్కన సీతారామమూర్తి
చౌదరిగారు ఇప్పటికే చిరకాలంనుండి మనకు తలమునకలు పెట్టించిన మధురమూర్తి. ఆ కవిత సరళగభీరధార. ఈ కవిబృందం చూచినారా! పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు. ఒక్కక్క రొక్క కవిత. మంచు తునకలు, మధుబిందువులు, కపురంపు పలుకలు, కోకిల కూతలు, అత్తరు జల్లులు,
అమృతంపు వెల్లువలు. ఆ కాలంలోనే వాసంతిని గుడివాడకు పట్టి తెచ్చేటట్లున్నారీ కవి కుమారులందరు. ఆయన కరుణశ్రీ, ఈయన ఆంధ్ర పురాణకర్త, వీరు వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారు మహా విద్వాంసులు. ఈ పడుచు జంట – కాకరపర్తి కవులు వేదుల సూరి, వేదుల వేంకటరావు.
ఇక బందా కనకలింగేశ్వరరావు
గారి చూపు ప్రోపులో – “విశ్వనాధు”ని త్రిశూలం, వేనరాజు, అంతా నాటకమే – చూచి ఇంటికి పోదాం పదండి.
15-1-56 – రెండవరోజు – అధ్యక్ష స్థానంలో కాటూరి వేంకటేశ్వరరావు
గారున్నారు. ఏమంటున్నారు – “జమ్మలమడక మాధవ రామశర్మ గారు
– అమృతవృష్టి కురుస్తారు – చెవులు దొరబెట్టి ఆస్వాదించండి”
ధూళిపాళ శ్రీరామమూర్తి గారి – ఈ పాదం పదికావ్యాల పెట్టు – వెంటబడి నీ తో వచ్చు మంజీరముల్
రవళింప బదిరెండు వర్షముల లేబ్రాయంపూదౌ తల్లి, నీవు చూచితివో లేదో గాని నే చూచితిన్”
సత్యనారాయణ కావ్యాపాదోధి
ద్రచ్చి తీసి వెన్న పంచిపెడుతున్నది కే.వి.రామకోటిశాస్త్రిగారు. ఆ వేయి పడగల విస్ఫూర్తులు విరజిమ్ముచున్నది కుమారి
డాక్టరు శ్రీదేవిగారు. ధన్వంతరి చిత్రం చేత
పట్టుకొని ఈ వామనమూర్తి యెవరు? ఉభయ భాషాప్రవీణ పెద్దింటి రామమూర్తి లెండి – నేడు తానిచ్చిన ఈ ధన్వంతరి చిత్రాన్ని
– తిరిగి – తనకు విశ్వనాధవారు రాబోయే మన్మధ
ఉగాదికి ఇచ్చివేయాలిట.
మధ్యాహ్నం
ఈ పూట కవిసమ్రాట్
కల్పవృక్ష ఫలములు చవిచూచిన శ్రీ వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాదుగారు అధ్యక్షత
నుండటం ఉచితశోభ. ఈ పలుకు పండిన, మనసు తనిసిన విద్వత్తామూర్తి
వేలూరి శ్రీరామశాస్త్రి గారు – మా సత్యనారాయణకు సన్మానము – మా కవి వంశానికే అన్నారు, మా గురువుగారికే అన్నారు.ఈ
చిరంజీవి మల్లాది వసుంధర, “మా గురువు (సత్యనారాయణ) గారి వచన రచన
అయిదేండ్లు తపస్సు చేసి – వరముగా వారినుండి పుచ్చుకున్నాను” ఈమె నిజముగ గురుపాదభక్త.
తన గేయ సంపుటి
కల్పవృక్ష కర్తకు అంకితమిచ్చేది కందుకూరి రామభద్రారావుగారు. “సంస్కృతి” (గేయనాటికలు) అంకితమిచ్చేది అడుసుమిల్లి
పూర్ణచంద్రరావుగారు.
చిటికెవేసి ఆ ఉపన్యసించేది
కాటూరి వేంకటేశ్వరరావుగారు. ఆయనేదో వక్రోక్తి వైభవం చూపిస్తున్నారు. ఒక్కొక్క మాట శ్రోతల
మనసుల నెట్లా కదలుస్తున్నదో చూచారా! ఒక్కమాటలో – కాలువలు, కమలాలుగా కలయపూచిన కాసారానికి
సూర్యోదయమట్లు అనిపిస్తోంది. ఆ ప్రోవులు చూచారా
! సహృదయుల బహూకృతులు – ఇక పోయి నాటకాలు చూచి, ఇకనైనా కల్పవృక్షము పెరట నాటిన కవి కావ్యాలు
ఒడలు దగ్గిర పెట్టుకొని చదువుకొందాం పదండి.
(కృష్ణా
పత్రిక విశ్వనాథ షష్టిపూర్తి సంచిక – 1956)