శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారిపై శ్రీ నోరి నరసింహశాస్త్రి గారి వ్యాసం
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ “పూవుం జిమ్ములు తేనెవాకలు రసంపుంబల్కు లానంద మో హావేశమ్ములు నీవు పెట్టినది పేరన్నా! భవద్గాన వీ ణా వైశద్యము సన్నగించి , గళితానందాశృరేఖా వ్యధా భావమ్ముల్ వెలిబుచ్చ వేమిటికి నీ పాటల్ వయష్షట్పదా” “రోలంబేశ్వర! నీది నిర్జరవయోరూపంబు శృంగార ల క్ష్మీ లీలారస పట్టభద్రుడవునున్ మేలే ! యిటుల్ వంత చే వ్రాలంగా గతమేమి ? లో మరచితో స్వాతంత్ర్య కళ్యాణ గా నా లీలామృత గీతికాక్షర సమామ్నాయంబు ప్రాయంబునన్” అది 1922 , 23 ప్రాంతము. బెజవాడలో శారదా భాండార ప్రెస్సుకు వెళ్ళగా , అక్కడ ప్రెస్సు మేనేజరు శ్రీ కొడాలి ఆంజనేయులు , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ , శ్రీ శివశంకర శాస్త్రి ఇత్యాది కవిమిత్రులు కలిసినారు. అదే నేను శ్రీ విశ్వనాథను ప్రథమ పర్యాయము కలిసికొనుట. కవిగా అప్పటి కాయన పేరు బందరంతా మారుమ్రోగుతున్నా , బయటి ప్రపంచానికి తగినంతగా ప్రాకలేదు. అందరమూ ఉత్సాహంగా సాహిత్య ప్రసంగంలో పడియున్న సమయంలో అప్పటికి రాబోతున్న సాహితి తృతీయ సంపుటము ప్రథమ సంచికకు పద్యాలు వ్రాసి పెట్టమని శ్రీ శి.శం.శాస్త్రి శ్రీ విశ్వనాథను తొందరచేస...